కేసీఆర్​ ను విమర్శిస్తూ టీ–కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలతోనే టీఆర్ఎస్ గెలిచింది
  • అధిష్ఠానం ఈసారి తమకు అవకాశం ఇవ్వాలి
  • రాబోయే రోజుల్లో కేసీఆర్ ను గద్దె దించడం ఖాయం
తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధిపై గవర్నర్ తో అధికార పార్టీ అసత్యాలు చెప్పించిందని ఆరోపించారు. ఇంటింటికీ నల్లా నీరు రావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత  కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శలు చేశారు. టీఆర్ఎస్ లో  చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, వాళ్లు త్వరలోనే బయటకు రాబోతున్నారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు.

 కొత్త పార్టీ పెడతామా అన్నది కాలమే నిర్ణయిస్తుంది

ఈ సందర్భంగా సొంత పార్టీపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలతోనే టీఆర్ఎస్ గెలిచిందని, రాష్ట్రంలో సరైన నాయకుడిని ఎన్నుకోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం తప్పు చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. అధిష్ఠానం ఈసారి తమకు అవకాశం ఇవ్వకపోతే ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తామా? లేక కొత్త పార్టీ పెడతామా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమని, ‘అది నా రూపంలో వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు.

Komatireddy Raj Gopal Reddy
Congress
kcr
TRS
cm
Telangana

More Telugu News